ఆలూరు నియోజకవర్గంలో విజయవంతంగా యువగళం నేడు ఆదోని నియోజకవర్గంలోకి చేరనున్న పాదయాత్ర

ఆలూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 75వరోజు ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో విజయవంతంగా ముందుకు సాగింది. అడుగడుగునా ప్రజలు మండుటెండలను సైతం లెక్కచేయకుండా యువనేతకు ఎదురేగి స్వాగతం పలుకుతూ తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఆలూరు నియోజకవర్గం కైరుప్పలలో  యువనేతకు మహిళలు, రైతులు,నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతులు తమ కష్టాలను వివరిస్తూ…  నకిలీ విత్తనాలతో నష్టపోతున్నామని వాపోయారు. విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చాక నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, విద్యుత్ ఛార్జీలను నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. కారుమంచి శివార్లలో ఓ పొలంలోకి వెళ్లిన యువనేత అక్కడ అరకదున్ని రైతు కష్టాలు తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన విరామానంతరం పాదయాత్ర దారిలో మురికికూపం నడుమ ఉన్న కారుమంచి అంగన్ వాడీ కేంద్రం, బోరు వద్ద ప్లాస్టిక్ బిందెలతో క్యూకట్టిన జనం వద్దకు వెళ్లి సెల్ఫీ దిగిన లోకేష్ ప్రభుత్వ పెద్దల వైఫల్యాలను ఎత్తిచూపారు. మూడురోజులపాటు ఆలూరు నియోజకవర్గంలో దుమ్మురేపిన యువగళం పాదయాత్ర…  గురువారం ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించనుంది.

సెల్పీతో యువనేత చురకలు…మేనమామలా చూసుకోవడమంటే ఇదేనా?

ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం కారుమంచి అంగన్ వాడీ కేంద్రం సెల్ఫీదిగిన యువనేత లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మురికికూపం నడుప ఉన్న ఈ అంగన్ వాడీ కేంద్రం వద్ద బిక్కుబక్కుమంటూ చూస్తున్న ఈ చిన్నారులను చూశావా ముఖ్యమంత్రీ? ఇక్కడకు వస్తే పౌష్టికాహారం మాట దేవుడెరుగు, రోగాలపాలు కావడం మాత్రం ఖాయం. చిన్నారులను మేనమామలా చూసుకోవడమంటే మురికికూపంలోని నెట్టి లేని రోగాలను అంటించడమా? అంటూ చురకలు అంటించారు.

 జనంపడే కష్టాలు చూశావా మంత్రీ?

ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం కారుమంచి గ్రామంలో బోరువద్ద ప్లాస్టిక్ బిందెలతో క్యూకట్టిన స్థానికప్రజల వద్దకు వెళ్లి సెల్ఫీదిగిన లోకేష్ మంత్రినుద్దేశించి ఘాటువ్యాఖ్యలు చేశారు. ఊళ్లో ఉన్న ఏకైక బోరు వద్ద నీళ్లు పట్టుకొని తోపుడుబళ్లపై తోలుకుంటూ గొంతు తడుపుకుంటున్నారు. ప్రజల బాగోగులు చూడాల్సిన స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు భూకబ్జాలు, సెటిల్మెంట్లతో మునిగితేలుతూ జనం కష్టాలు గాలికొదిలేసి నాలుగేళ్లుగా ముఖం చాటేశారు. నీ నియోజకవర్గంలో గుక్కెడు నీళ్లందక ప్రజలు పడుతున్న ఈ అవస్థలు చూశావా మంత్రి గారూ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇప్పుడే రాజకీయాలొద్దు… మంచిగా చదువుకో! బాలుడికి నచ్చజెప్పి పంపించేసిన యువనేత

యువగళం పాదయాత్రలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చేసుకుంది. ఆలూరు నియోజకవర్గం పుప్పలదొడ్డిలో యువగళం పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో  ఓ బుడతడు పసుపురంగు టీషర్టుతో ఉత్సాహంగా యాత్రలో అడుగులు వేస్తున్నాడు. ఇది గమనించిన యువనేత లోకేష్ ఆ బాలుడ్ని దగ్గరకు తీసుకొని అప్యాయంగా పలకరించి కుశలప్రశ్నలు వేశారు. అప్పుడే రాజకీయాలు వద్దు, ముందు మంచిగా చదువుకోవాలని చెప్పి టీషర్టు తీయించి నచ్చజెప్పి పంపించేశారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తూ లబ్ధిపొందేందుకు తహతహలాడుతున్న ఈరోజుల్లో బాలుడి భవిష్యత్ కోసం దూరదృష్టితో ఆలోచించారు యువనేత లోకేష్.

చిన్నారులవద్దకు యువనేత… ఆనందంతో కేరింతలు

పాదయాత్ర దారిలో యువనేత స్కూలు చిన్నారుల వద్దకు వెళ్లడంతో వారు ఆనందంతో కేరింతలు కొట్టారు. పాదయాత్ర ఆలూరు నియోజకవర్గం కైరుప్పల చేరుకున్నప్పుడు దారిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తనకోసం వేచిచూడటం గమనించిన యువనేత వారి వద్దకు వెళ్లారు. దీంతో అక్కడ ఉన్న చిన్నారులు ఒక్కసారిగా లోకేష్ ను చుట్టుముట్టి కౌగలించుకున్నారు. ఏం చదువుకుంటున్నారు, మార్కులు ఎలా వస్తున్నాయి, ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అని యువనేత వారిని అడిగారు. కొందరు చిన్నారులు మధ్యాహ్న భోజనం సరిగా ఉండటం లేదని చెప్పారు. ఉపాధ్యాయులను గౌరవించాలి, బాగా చదువుకొని అమ్మా నాన్న లకు మంచి పేరు తేవాలి.  ఉన్నత స్థానాలకు చేరుకోవాలని చెప్పిన యువనేత విద్యార్థులతో ఫోటోలు దిగి, చాక్లెట్లు ఇచ్చి అక్కడనుంచి బయలుదేరారు.

యువనేత ఎదుట వ్యక్తమైన అభిప్రాయాలు:

జీతాలు పెంచలేదు..ఉద్యోగ భద్రత లేదు : హోంగార్డులు

నేను అధికారంలోకి వస్తే హోంగార్డులకు తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువగా జీతాలిస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ వారితో సమానంగా మాకు ఇవ్వడంలేదు. తెలంగాణ హోంగార్డులకు అక్కడి ప్రభుత్వం రూ.35 వేల జీతం వస్తోంది. చంద్రబాబు సీఎం కాక ముందు రూ.12 వేల జీతం వచ్చేంది..చంద్రబాబు వచ్చాక రూ.6 వేలు పెంచారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కేవలం రూ.3వేలు మాత్రమే పెంచారు. టీఏ, డీఏలు ఇవ్వడం లేదు. మమ్మల్ని రోప్ పార్టీకి పంపుతున్నారు. కనీసం షూ కూడా అందించడం లేదు. టీఏ, డీఏలు మాకు కూడా అమలు చేయాలి. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించాలి.

పెయింట్ అమ్మకాలు తగ్గాయి : రాజు, గుమస్తా, దేవనకొండ

నేను పెయింట్ వ్యాపారుల దగ్గర గుమస్తాగా పనిచేస్తా. పెయింట్ అమ్మకాలు ఇంత ఘోరంగా ఎప్పుడూ లేవు. అమ్మకాలు తగ్గడంతో మా జీతాలు కూడా తగ్గుతున్నాయి. జీఎస్టీ కూడా తగ్గిస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఇసుక ప్రభావం వల్ల భవన నిర్మాణాలు తగ్గాయి. నిర్మాణాలు ఎక్కువగా జరిగితే పెయింట్ అమ్మకాలు పెరుగుతాయి.

టిడిపితోనే బిసిలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం! బిసిలను తప్పుడు కేసులతో వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చాక బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం, ముఖాముఖి సమావేశంలో యువనేత నారా లోకేష్

ఆలూరు: టిడిపి ఆవిర్భావంతోనే బీసీలకు రాజకీయ, ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది, స్వర్గీయ ఎన్టీఆర్ బిసిలకు పెద్దపీట వేశారని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఆలూరు నియోజకవర్గం కారుమంచిలో బీసీ సామాజికవర్గ ప్రతినిధులతో యువనేత ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టిడిపి. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందించాం. టిడిపి హయాంలో ఆర్ధిక శాఖ, టిటిడి, తుడా ఛైర్మెన్ లాంటి కీలక పదవులు బిసిలకు ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వ పాలనలో నిధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బిసిలకు 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి స్థానిక సంస్థల్లో 16,500 మంది బిసిలకు పదవులు దక్కకుండా చేశారు. బీసీ నాయకత్వాన్ని దెబ్బతీయడానికి వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది.

సమస్యలు పరిష్కరించమంటే తప్పుడు కేసులా?

ప్రజా సమస్యలు పరిష్కారం చెయ్యమని అడిగితే మంత్రి బిసిల పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మంత్రి వాల్మీకిలకు చేసింది ఎంటి? ఆయన బెంజ్ కారులో తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్న వాల్మీకిలకు చిన్న కారు కొనుక్కునే స్థితిలో అయినా ఉన్నారా? మంత్రి గారు వందల ఎకరాలు అధిపతి అయ్యారు. ఇక్కడ ఉన్న వాల్మీకిలు ఒక్క ఎకరం కొనే పరిస్థితి ఉందా? ఇటినా భూములు పై ఛాలెంజ్ చేసా. ప్రభుత్వ ధర చెల్లిస్తే భూములు రైతులకు రాసిస్తా అని మంత్రి అన్నారు. ఆ డబ్బులు మేము చెల్లిస్తాం అని చెప్పా. ఆ భూములు రైతుల పేరిట రాయడానికి మంత్రి సిద్దమా? వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చేందుకు టీడిపి సత్యపాల్ కమిటీ వేసాం, అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. నాలుగేళ్లు డ్రామా చేసిన జగన్ ఇప్పుడు బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేరుస్తామని కొత్త తీర్మానం అంటున్నాడు. వాల్మీకిలకి టిడిపి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని ఎస్టీల్లో చేర్చేందుకు కేంద్రం తో పోరాడతాం.

వడ్డెర్లకు మైన్లను వెనక్కి ఇప్పిస్తాం

వడెర్ల కోసం ఫెడరేషన్ ఏర్పాటు చేసింది టిడిపి. వడెర్ల కోసం మైన్లు కేటాయించింది టిడిపి. ఆ మైన్ల ను వైసిపి నాయకులు లాక్కున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మీ మైన్లు మీకు తిరిగి కేటాయిస్తాం. బడుగు, బలహీన వర్గాలను విద్య కి దూరం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాలను నిర్వీర్యం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రుల పై ఒత్తిడి లేకుండా నేరుగా కాలేజీలకు ఫీజులు చెల్లిస్తాం. పదో తరగతి ఫెయిల్ అయిన అతనికి క్రీడల విలువ ఏమి తెలుస్తుంది. రాయలసీమ కి స్పోర్ట్స్ యునివర్సిటీ తీసుకొస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. బీరప్ప దేవాలయాలు నిర్మాణం కోసం ప్రభుత్వం ద్వారా సహాయం చేస్తాం. అలాగే పూజారులను గౌరవ వేతనం ఇచ్చి ఆదుకుంటాం.

గొర్రెలకు ఇన్సూరెన్స్ కల్పిస్తాం

కురబ సామాజిక వర్గం వారి కోసం టిడిపి హయాంలో గొర్రెలు కొనడానికి రుణాలు అందించాం. మందులు, మేత, దాణా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్సిడీ లో మందులు, మేత, దాణా అందజేస్తాం. గొర్రెలకు ఇన్స్యూరెన్స్ సదుపాయం కల్పిస్తాం. డప్పు కళాకారులని ఆదుకుంటాం. బీసీ భవనాలు, కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం. యాదవ సామాజిక వర్గాన్ని ఆదుకుంది టిడిపి. యాదవ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసింది వైసిపి.

బిసి సామాజికవర్గీయులు మాట్లాడుతూ…

కల్లుగీత కార్మికులను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోంది. భీమా కూడా లేదు, చెట్ల పెంపకానికి బీడు భూములు ఇవ్వాలి. వడ్డెర కులస్తులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. మాకు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నాం. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు పడటం లేదు. కాలేజీ వాళ్ళు డబ్బులు కట్టాలని వేధిస్తున్నారు. బీసీ క్రీడాకారులను ప్రభుత్వం ఆదుకోవడం లేదు. బిసి సర్టిఫికేట్లు తీసుకోవడంలో అనేక ఇబ్బందులు పడుతున్నాం. యాదవ సామాజిక వర్గానికి వైసిపి హయాంలో తీవ్ర అన్యాయం జరిగింది.

బిసిల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:

రాజశేఖర్ గౌడ్, కల్లుగీత కార్మికుడు, దేవనకొండ : మీ ప్రభుత్వంలో గీత కార్మికులకు బీమా ఉండేది..ఇప్పుడు ఎత్తేశారు. కల్లు చెట్లన్నీ నరికేశారు. చెట్లు నాటుకోవడానికి బీడు భూములు ఇవ్వాలి. దేవనకొండలో హాస్టల్, మోడల్ స్కూల్ లేదు. హాస్టల్ సౌకర్యం కల్పించాలి.

రమేష్, ఆలూరు : వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలి. రాళ్లు కొట్టుకుని చనిపోయేవారికి బీమా ఏర్పాటు చేయాలి.

సత్యయాదవ్ : నేను ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నా. రెండవ సంత్సరంలో నాలుగవ సెమిస్టర్ అయ్యాక కూడా ఫీజు రీయింబర్స్ పడలేదు. ఫీజు కడితేనే మళ్లీ పరీక్షలు రాయనిస్తాం అన్నారు. సచివాలయానికి వెళ్లి అడిగినా ఫలితం లేదు. నేను నేషనల్ ప్లేయర్. TDP ప్రభుత్వంలో రూ.1.7 లక్షలు మాకు ప్రోత్సాహకాలు అందాయి. ఈ ప్రభుత్వంలో మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

జగదీష్, వాల్మీకీ : బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు వచ్చేవి..ఇప్పడు రాలేదు. 2018లో డిగ్రీ అయింది..నేను వ్యవసాయమే చేస్తున్నా. ఈ ప్రభుత్వంలో పనిముట్లు, సబ్సీడీలు అందడం లేదు.

రామనాథ్ యాదవ్ : తిరుపతిలో సన్నిధిగొల్లలో గొల్లలను మాత్రమే కంటిన్యూ చేయాలి. యాదవ కార్పొరేషన్ ద్వారా రూ.2 వేల కోట్లు నిధులు కేటాయించాలి. రాజధానిలో బీసీ భవన్ ఏర్పాటు చేయాలి.

యువనేత లోకేష్ ను కలిసిన వలగొండ గ్రామస్తులు

ఆలూరు నియోజకవర్గం వలగొండ గ్రామస్తులు యువనేత లోకేష్ ను తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో తుమ్మల వంకపై వంతెన ఉంది. దీనిపై మేం నిత్యం కర్నూలు, బళ్లారి హైవేపై ఆస్పరి గ్రామాలకు ప్రయాణిస్తుంటాం. పై తరగతులు చదివేందుకు విద్యార్థులు దీనిపైనే ప్రయాణించాల్సి ఉంది. వర్షాలు పడినప్పుడు 3-4 రోజులు ఈ వంక పొంగుతుంది. ఆ సమయంలో మేం ప్రయాణం చేయలేక ఇబ్బందులుపడుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక తుమ్మల వంక బ్రిడ్జి నిర్మించండి. వలగొండ నుండి పప్పుల దొడ్డి వరకు రోడ్డు నిర్మించాలని కోరుతున్నాం.

నారా లోకేష్ స్పందిస్తూ…

రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర వహించే మౌలిక సదుపాయాలను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వైసిపి అధికారంలోకి వచ్చాక రోడ్లు, డ్రైన్లు, వంతెన నిర్మాణాలు, సాగు, తాగు ప్రాజెక్టులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. టిడిపి అధికారంలోకి వచ్చాక తుమ్మల వంక బ్రిడ్జి, వలగొండ నుండి పప్పులదొడ్డి వరకు రోడ్డు నిర్మాణాన్ని చేపడతాం.

యువనేతను కలిసి కన్నీరుమున్నీరైన ఖాసింబీ

ఆలూరు నియోజకవర్గం కుప్పాల దొడ్డిలో చిరుమాను దొడ్డి గ్రామస్తురాలు ఖాంసింభీ యువనేత లోకేష్ ను కలిసి తమ కష్టాలు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది. నా భర్త రైతు కింజారి రంజన్ గత నెల 31న ఆత్మహత్య చేసుకున్నాడు. గత రెండేళ్లుగా నకిలీ విత్తనాలు,పురుగుల మందులతో పంటనష్టం వచ్చింది. రూ.9లక్షలు అప్పుల పాలయ్యాం. వడ్డీలు కట్టలేని పరిస్థితి వచ్చింది. మానసిక ఒత్తిడితో పొలంలోనే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బాకీ తీర్చాలని అప్పులవాళ్లు మాపై ఒత్తిడి చేస్తున్నారు. కలెక్టర్ ను కలిసినా ప్రభుత్వం నుండి నేటికీ పరిహారం అందలేదు. మా కుటుంబాన్ని మీరే ఆదుకోవాలి సార్ అంటూ ఆవేదన వ్యక్తంచేసింది.

నారా లోకేష్ స్పందిస్తూ…

వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఖాసింబీ కుటుంబమే ఇందుకు ఉదాహరణ.. రైతులు నకిలీ విత్తనాలు, ఎరువులతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఖాసింబీ కుటుంబానికి పరిహారం కోసం ప్రభుత్వానికి లేఖరాసి పరిహారం అందేలా కృషిచేస్తాం.

యువనేతను కలిసిన యాదవ సామాజికవర్గీయులు

ఆలూరు నియోజకవర్గం పుప్పలదొడ్డిలో యాదవ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మాకు దామాషా ప్రకారం ఎమ్మెల్యే సీట్లు, నామినేటెడ్ పోస్టులు కేటాయించాలి. గొర్రెల కాపరులకు 50ఏళ్లకు పెన్షన్ అందించాలి. గొర్రెలతో పాటు, ఆవులను కూడా సబ్సిడీపై అందించి, వాటికి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలి. స్కిల్ డెవలప్ మెంట్ కింద యాదవ యువతీ, యువకులకు శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించాలి. యాదవ విద్యార్థులకు విదేశీవిద్య పథకాన్ని అమలు చేసి రూ.20లక్షలవరకు సాయం అందించాలి. టీటీడీ పాలకమండలిలో శాశ్వత సభ్యునిగా యాదవులను నియమించాలి. రాష్ట్రంలో ప్రతిజిల్లాలో స్థలాలు కేటాయించి, యాదవ భవనాలు నిర్మించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

రాజకీయంగా యాదవులకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టిడిపి హయాంలో కీలకమైన ఆర్థికమంత్రిగా యనమల, టిటిడి చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ లను నియమించాం. టిడిపి అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని పునరుద్దరిస్తాం. యువతకు స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. సబ్సిడీపై గొర్రెలు, ఆవులు అందజేసి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాం.

యువనేత లోకేష్ ను కలిసిన కైరుప్పల గ్రామస్తులు

ఆలూరు నియోజకవర్గం కైరుప్పల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో వెంగలాయ దొడ్డి  చెరువు ఉంది. ఈ చెరువు కింద ప్రత్యక్షంగా నాలుగు గ్రామాలు, పరోక్షంగా మూడు గ్రామాల్లో వ్యవసాయం సాగవుతోంది. వెంగలాయదొడ్డి చెరువు నిండకపోవడం వల్ల మా పొలాలు బీడు భూములుగా మారుతున్నాయి. మాకు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని నాలుగేళ్లుగా కలెక్టర్ కు వినతిపత్రాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించి మమ్మల్ని ఆదుకోండి.

యువనేత లోకేష్ స్పందిస్తూ…

తెలుగుదేశం ప్రభుత్వంలో తాగు, సాగు నీటి ప్రాజెక్టుల పనులు వేగవంతంగా జరిగాయి. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకోసం చంద్రబాబునాయుడు రూ.11వేల కోట్లు ఖర్చుచేశారు.  గత ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా పనులను 90శాతం పూర్తిచేస్తే, నాలుగేళ్లలో మిగిలిన 10శాతం పనులు చేయలేని ముఖ్యమంత్రి. టిడిపి అధికారంలోకి వచ్చాక వెంగళాయదొడ్డికి నీరందించేందుకు చర్యలు తీసుకుంటాం.

*ఆరకదున్ని అన్నదాత కష్టాలు తెలుసుకున్న యువనేత

ఆలూరు నియోజకవర్గం కారుమంచి శివార్లలో యువనేత పాదయాత్ర చేస్తున్న సమయంలో  పొలం పనులు చేసుకుంటున్న ఓ రైతువద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా అరకదున్నుతూ రైతన్న కష్టాలు తెలుసుకున్నారు. మేం ముగ్గురు అన్నదమ్ములం కలిసే ఉంటున్నాం, మా ఉమ్మడి కుటుంబానికి 11 ఎకరాల భూమి ఉంది. గత ఏడాని మూడు ఎకరాల్లో ఉల్లిసాగు చేయగా, వరదవచ్చి పంట మొత్తం కొట్టుకుపోవడంతో రూ.3లక్షల నష్టం వచ్చింది. 4 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తే నాసిరకం విత్తనాలు కావడంతో 2 క్వింటాళ్లే దిగుబడి వచ్చింది. మరో నాలుగు ఎకరాల్లో వేరుశనగ నాటితే 14.35 క్వింటాళ్ల దిగుబడి రాగా, పెట్టుబడి, కూలీలు పోనూ రూ.2.40 లక్షల నష్టం వచ్చింది. మేం వ్యవసాయం చేయబడ్డాక ఇంత భారీనష్టాలు జీవితంలో చూడలేదు. ట్రాన్స్ ఫార్మర్ ఫీజు వేయాలంటే హెల్పర్లు రూ.5 వందలు అడుగుతున్నారు. ఏటికేడు నష్టాలు చవిచూస్తున్నా మరో పని తెలియకపోవడంతో వ్యవసాయం చేయాల్సి వస్తోంది. ప్రభుత్వాలు ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని చాలించడం తప్ప మరో మార్గంలేదు.

యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ…

రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనాలోచిత విధానాల కారణంగా అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. టిడిపి హయాంలో ఎపిలో రైతుల సగటు అప్పు రూ.70వేలు ఉంటే, ఇప్పుడూ దేశంలోనే అత్యధికంగా రూ.2.5లక్షలకు చేరింది. గత ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, విత్తనాలు, ఎరువులు, యంత్రపరికరాలు అందజేశాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో రైతులకు ఇచ్చిన సబ్సిడీలన్నీ ఎత్తేశాడు. ధైర్యంగా ఉండండి…రాబోయే చంద్రన్న ప్రభుత్వం అన్నదాతలకు అన్నివిధాలా అండగా నిలుస్తుంది.

యువనేత లోకేష్ ను కలిసిన కారుమంచి గ్రామస్తులు

ఆలూరు నియోజకవర్గం కారుమంచి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో తాగునీటి ఎద్దడి అధికంగా ఉంది. డ్రైనేజీలు లేక మురుగు నీరు రోడ్లపై పారుతోంది. చౌడమ్మ గుడి వద్దనున్న 200కుటుంబాల్లో ఒక్క ఇంటికీ కుళాయి లేదు. గ్రామంలో సీసీ రోడ్లు లేవు. ఎంపీపీ పాఠశాల ప్రహరీ గోడ లేదు. హైస్కూల్ వద్ద రోడ్డు సదుపాయం లేదు, ప్రహరీగోడ లేదు. నాయకులు, అధికారులకు సమస్యలపై విన్నవించినా ఫలితం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి.

*నారా లోకేష్ స్పందిస్తూ…*

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో ప్రజలకు గుక్కెడు నీరందించే నాధుడే కరువయ్యాడు. టీడీపీ పాలనలో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వైసీపీ వచ్చాక వాటా నిధులను చెల్లించలేక ఆ పథకాన్ని అటకెక్కించింది. కేంద్రం నిధులను వినియోగించడంలో విఫలమైంది. టిడిపి అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ తాగునీటి కుళాయిలు ఏర్పాటుచేస్తాం. డ్రైనేజిలు, సిసి రోడ్లు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, కాంపౌండ్ వాల్ నిర్మిస్తాం.

*యువనేతను కలిసిన ములుగుండం ప్రజాప్రతినిధులు

యువనేత నారా లోకేష్ ను ములుగుండం సర్పంచ్, ఎంపిటిసిలు కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.  చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మా గ్రామానికి రూ.7.50కోట్లు నిధులు ఇచ్చారు. ఎన్నికలు సమీపించడంతో గ్రామంలో పనులు మొదలు కాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2022లో కాంట్రాక్టరు పనులు మొదలు పెట్టాడు. మంత్రి కాంట్రాక్టరు వద్ద రూ.1.50కోట్లు కమీషన్ తీసుకున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో మా గ్రామంలో టీడీపీ గెలవడంతో పనులు నిలిపేశారు. కాంట్రాక్టరు వద్ద తీసుకున్న కమీషన్ ను కూడా మంత్రి వదిలేశాడు. మీరు అధికారంలోకి వచ్చాక  ములుగుండం గ్రామానికి రోడ్లు వేయించాలి. మా గ్రామానికి సుజలస్రవంతి కాలువ నుండి తాగు,సాగు నీరు అందించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

గత ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి చంద్రబాబునాయుడు పెద్దపీట వేశారు. ఇదివరకెన్నడూ లేనివిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మించాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో రోడ్లపై కనీసం మట్టిపోసే దిక్కుకూడా లేదు. మంత్రి కమీషన్లు, కబ్జాలపై ఉన్న శ్రద్ద గ్రామాల అభివృద్ధిపై లేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక మీ గ్రామానికి నిధులు కేటాయించి రోడ్లు నిర్మిస్తాం. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ ద్వారా తాగు, సాగు నీరు అందిస్తాం.

Also, read this blog: Empowered, Enriched, Transformed: The Yuvagalam Way to Success

Tagged#LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *