Yuvagalam Padayatra

నంద్యాల అసెంబ్లీలో యువగళానికి పోటెత్తిన జనం! కొత్తపల్లి శివార్లలో యువనేతకు అపూర్వ స్వాగతం శ్రీశైలం నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిన పాదయాత్ర

నంద్యాల: శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో 3రోజులపాటు విజయవంతంగా సాగిన యువగళం పాదయాత్ర 101వరోజు కొత్తపల్లి శివార్లలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పాదయాత్ర నంద్యాల పరిధిలోకి ప్రవేశించగానే యువగళానికి జనం పోటెత్తారు. భారీగా తరలివచ్చిన జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. నంద్యాలకు వెళ్లే ప్రధాన రహదారిపై కిలోమీటరు పొడవునా యువనేత కోసం జనం బారులు తీరారు. కార్యకర్తలు, అభిమానుల  నినాదాలు, బాణాసంచా మోతలతో యువనేతకు అపూర్వస్వాగతం పలికారు. అడగగుడుగునా హారతులతో మహిళల నీరాజనాలు పట్టగా, కార్యకర్తలు యువనేతపై పూలవర్షం కురిపించారు. జై లోకేష్… జై తెలుగుదేశం నినాదాలతో యువగళం హోరెత్తింది. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో ట్రాపిక్ జామ్ అయి వాహనాలు నిలచిపోయాయి. బండి ఆత్మకూరు క్యాంప్ సైట్ లో ఎన్ఎంఆర్/ టైమ్ స్కేల్ ఉద్యోగులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. అధికారంలోకి వచ్చాక వారి సమస్యలు పరిష్కరిస్తామని, ఎన్ఎంఆర్/టైమ్ స్కేలు ఉద్యోగులు చేసే పోరాటానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అనతంతరం పార్నెపల్లిలో రోడ్డుపక్కన పంచర్లు వేస్తున్న హుస్సేన్ బీ అనే వృద్ధురాలిని కలిసి ఆమె సాధకబాధకాలు తెలుసుకున్నారు. తనకు హజ్ యాత్రకు వెళ్లాలని ఉందని ఆమె చెప్పగా, సొంత ఖర్చులతో పంపిస్తానని యువనేత చెప్పారు. అనంతరం కొత్తపల్లి వాసులు యువనేత Nara Lokesh ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. 101వరోజు యువనేత లోకేష్ 10.8 కి.మీ. దూరం పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు మొత్తం 1293.8 కి.మీ.మేర యువగళం పాదయాత్ర పూర్తయింది. 102వరోజు యువగళం పాదయాత్ర పూర్తిగా నంద్యాల పట్టణంలో కొనసాగనుంది.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

పీకమీద కత్తిపెట్టి భూములు లాగేసుకున్నారు!

-గ్రీన్ కో ప్రాజెక్టు నిర్వాసితుల ఆవేదన

పాణ్యం నియోజకవర్గం పిన్నాపురానికి చెందిన గ్రీన్ కో ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోయిన రైతులు యువనేత లోకేష్ ను కలసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వెంకట్రాముడు అనే రైతు మాట్లాడుతూ… మా అన్నదమ్ములకు 12ఎకరాల పొలం ఉంటే గ్రీన్ కో ప్రాజెక్టు వారు ఇప్పటికే 10ఎకరాలు లాగేసుకున్నారు. ఇంకా 3ఎకరాలు మిగిలి ఉంటే అది కూడా ఇవ్వాలని మానాన్నపై వత్తిడి తెస్తున్నారు. పొలం ఇవ్వకపోతే పొక్లయినర్ తో ఇల్లు కూల్చేస్తామని బెదిరిస్తున్నారు. పోలీసులతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. మార్కెట్ ధర ప్రకారం మాకు పరిహారం ఇవ్వకుండా ఇచ్చింది తీసుకొని భూములు ఖాళీచేయాలని వత్తిడి తెస్తున్నారని వాపోయారు. మరో రైతు వెంకటరమణ తమ గోడు విన్పిస్తూ… నాకు నలుగురు ఆడపిల్లలు, ఒక మగబిడ్డ ఉన్నారు. నాకున్న 8ఎకరాల్లో 4ఎకరాలు గ్రీన్ కో ప్రాజెక్టుకు లాగేసుకున్నారు. న్యాయబద్ధమైన పరిహారం ఇవ్వాలని అడిగినందుకు తప్పుడు కేసులు పెట్టారు. మేము భూమిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. భూములు తీసుకునే సమయంలో ఇళ్లస్థలాలిచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తామని, తర్వాత పట్టించుకోలేదు. పరిహారం కూడా కొందరికి రూ.7లక్షలు, మరికొందరికి రూ.11లక్షలు, ఇంకొందరికి రూ.13లక్షలు ఇచ్చారు. మాకు న్యాయం చేయాలని కోరాడు. గ్రీన్ కో బాధిత రైతులకు అండగా నిలుస్తామని యువనేత లోకేష్ హామీ ఇచ్చారు.

మ‌న‌వ‌డిలా లోకేష్ భ‌రోసా..అవ్వ కులాసా యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో షేక్ హుసేన్ బేగ్ తో లోకేష్ మాటా మంతీ వృద్ధురాలి చిర‌కాల కోరిక హ‌జ్ యాత్ర వెళ్లేందుకు తానే సాయం అందిస్తాన‌ని భ‌రోసా షేక్ హుసేన్ బేగ్ ఆత్మ‌విశ్వాసం, సేవాగుణం చూసి అభినందించిన లోకేష్‌

ఆ నిరుపేద ముస్లిం వృద్ధురాలికి హ‌జ్ యాత్ర చేయాల‌నేది చిర‌కాల కోరిక‌. అర‌వై ఏళ్లు దాటిపోయాయి. ఏడాది క్రితం భ‌ర్త చ‌నిపోయాడు. బ‌తుకుబండిని న‌డిపిస్తున్న అవ్వ‌కు మ‌న‌వ‌డిలా న‌డిచొచ్చి భ‌రోసా ఇచ్చాడు నారా లోకేష్‌. నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం, పార్నపల్లి గ్రామం మీదుగా యువ‌గ‌ళం పాద‌యాత్ర సాగుతుండ‌గా, దారిప‌క్క‌న షేక్ హుసేన్ బేగ్ అనే అర‌వై ఏళ్ల‌కి పైబ‌డిన వృద్ధురాలు సైకిల్ పంక్చ‌ర్ల షాపు న‌డుపుతూ లోకేష్‌కి క‌నిపించింది. ఆ అవ్వ‌తో మాట్లాడిన లోకేష్ అచ్చెరువొందారు. భ‌ర్త షేక్ అబ్దుల్ హకీమ్ (70) పంక్చ‌ర్ షాపు న‌డుపుతూ త‌న‌ను పోషించేవాడ‌ని చెప్పింది. ఏడాది క్రితం కిడ్నీ స‌మ‌స్యతో భ‌ర్త చ‌నిపోవ‌డంతో, గ‌తంలో తాను నేర్చుకున్న సైకిల్ పంక్చ‌ర్లు ఇప్పుడు ఉపాధిగా మారింద‌ని వివ‌రించింది. రోజంతా పనిచేస్తే  రూ.150 ఆదాయం రావ‌డం క‌ష్టంగా ఉంద‌ని, నెల‌కి క‌రెంటు బిల్లు మాత్రం రూ.500 దాటిపోతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. హ‌జ్ యాత్ర‌కి వెళ్లాల‌నేది జీవిత‌కాల కోరిక అనీ, దాని కోసం తినీ తిన‌క ఓ ప‌దివేలు దాచుకున్నాన‌ని, హ‌జ్  వెళ్లాలంటే ల‌క్ష‌లు ఖ‌ర్చవుతాయ‌ని తెలిసి, దాచుకున్న ఆ ప‌దివేల‌తో పేద మ‌హిళ‌ల‌కి చీరలు కొని పంచేశాన‌ని చెప్పింది. 60 ఏళ్లు పైబ‌డిన ఆ వృద్ధురాలు ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌కుండా, త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డ‌డం చూసిన లోకేష్ ఆమెని అభినందించారు. నిస్స‌హాయురాలైనా క‌ల‌త చెంద‌కుండా క‌ష్ట‌ప‌డే త‌త్వం, దాన‌గుణంతో న‌లుగురికి సేవ చేస్తున్న షేక్ హుసేన్ బేగ్ ఆద‌ర్శ మ‌హిళ అని కొనియాడారు. ఆమె జీవిత‌కాల కోరిక అయిన హ‌జ్ యాత్రకి త‌న సొంత ఖర్చుతో పంపుతాన‌ని లోకేష్  షేక్ హుసేన్ బేగ్ కి భ‌రోసా ఇచ్చారు.

లోకేష్ ను కలిసిన ఎన్ఎంఆర్/టైమ్ స్కేల్ ఉద్యోగులు

శ్రీశైలం నియోజకవర్గం బండిఆత్మకూరు శివారు క్యాంపు సైట్ లో కర్నూలుజిల్లా ఎన్ఎంఆర్/టైమ్ స్కేల్ ఉద్యోగులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా  వివిధ శాఖల్లో ఎన్ఎంఆర్/టైం స్కేలు ఉద్యోగులుగా 3 దశాబ్ధాలుగా సేవలందిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో మా సంఖ్య 10వేలు ఉండగా, కొందరు అనారోగ్యానికి గురై మరణించారు, మరికొందరు పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం 4,365మంది  ఫుల్ టైం, 380మంది పార్ట్ టైంగా సేవలందిస్తున్నాం. తెలంగాణా రాష్ట్రంలో పంచాయితీరాజ్, విద్య, అటవీశాఖల్లో పనిచేస్తున్న మా సహచర సిబ్బంది (1993కి పూర్వం పనిచేస్తున్నవారు)ని క్రమబద్దీకరించారు. గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మమ్మల్ని పర్మినెంట్ చేస్తామని చెప్పారు. సర్సీసు క్రమబద్ధీకరణ సకాలంలో జరగకపోవడంతో 30సంవ్సరాల సర్వీసు ఉన్నప్పటికీ అనారోగ్యానికి గురై మరణించిన సిబ్బంది కుటుంబాలు ఎటువంటి బెనిఫిట్స్ అందక రోడ్డున పడుతున్నారు. 25-11-1993 నాటికి విధుల్లో ఉండి పదేళ్లు సర్వీసు ఉన్న పార్ట్ టైమ్ సిబ్బందిని క్రమబద్దీకరించాలి. 25-11-1993 నాటికి ముందుగానే నియమితులై సర్సీసు క్రమబద్దీకరణ కాకుండానే పదవీవిరమణ చేసిన వారి కుటుంబాలకు గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలి. సర్వీసు క్రమబద్దీకరణ కాకుండా మరణించిన ఎన్ఎంఆర్/టైం స్కేలు ఉద్యోగుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇవ్వాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులను దారుణంగా మోసగించారు. అధికారం కోసం రకరకాల హామీలు ఇచ్చిన సిఎం ఆ తర్వాత అందరినీ నట్టేట ముంచాడు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రశాంతంగా జీవించే పరిస్థితులు లేవు. దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎన్ఎంఆర్/ టైమ్ స్కేలు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తాం. ఎన్ఎంఆర్/ టైమ్ స్కేలు ఉద్యోగులు చేసే పోరాటానికి అండగా నిలుస్తాం.

యువనేత లోకేష్ సమక్షంలో పార్టీలో చేరికలు

శ్రీశైలం నియోజకవర్గం పార్నెపల్లిలో వైసిపి సీనియర్ నాయకుడు రాఘవరెడ్డి నేతృత్వంలో 400 కుటుంబాలు యువనేత నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. రాఘవరెడ్డి, మురళీధర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులకు లోకేష్ పసుపు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో వైసిపి అరాచకపాలనపై విసుగుచెంది ఎంతోమంది టిడిపిలోకి వస్తున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనను అంతమొందించేందుకు ఎవరు కలిసి వస్తామన్నా టిడిపి స్వాగతిస్తుందని లోకేష్ చెప్పారు. పార్నెపల్లిలో కొత్తగా పార్టీలో చేరిన నేతలు ఇన్ చార్జి బుడ్డా రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో సీనియర్లతో కలిసి పనిచేయాలని విజ్జప్తి చేశారు.

యువనేత లోకేష్ ను కలిసిన కొత్తపల్లి గ్రామప్రజలు

నంద్యాల నియోజకవర్గం కొత్తపల్లి గ్రామప్రజలు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామ పొలాల్లోనికి వెళ్ళాలంటే దార్లు లేవు. పొలాలకు వెళ్లే పుంతరోడ్ల నిర్మాణం చేపట్టాలి. గత ప్రభుత్వంలో కేటాయించిన ఎన్ టీఆర్ గృహాలకు ఇప్పటికీ బిల్లులు పూర్తి చెల్లించలేదు. మా గ్రామంలో స్మశాన వాటికలకు ప్రహరీ గోడలు నిర్మించాలి. మా గ్రామంలో ముస్లింల కోసం ఈద్గా నిర్మించాలి. మా గ్రామంలో పసుపు పంట అధికంగా పండిస్తున్నాం. వైసిపి ప్రభుత్వం వచ్చాక మద్దతు ధర ఇవ్వడంలేదు. మా గ్రామంలో నీటి సమస్య చాలా ఉంది. దానిని పరిష్కరించాలి. మురుగు కాలువలు లేకపోవడంతో, వర్షాకాలంలో నీరు నిలిచి విష జ్వరాల బారిన పడుతున్నాం. 1వ కిలో మీటర్ కేసీ కెనాల్  వాటర్ లైన్ ను – (తూము) మా గ్రామానికి కేటాయించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామసీమలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. రాయలసీమ ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వలేని ముఖ్యమంత్రి సిగ్గులేకుండా రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటున్నాడు. ఎన్నికల సమయంలో రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానని చెప్పిన సిఎం, ఎన్నికల తర్వాత పత్తాలేకుండా పోయారు. TDP అధికారంలోకి రాగానే గ్రామాలకు పుష్కలంగా నిధులు కేటాయించి గత వైభవం తెస్తాం. వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి ఇంటింటికీ తాగునీటి కుళాయి అందిస్తాం. గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైనేజిలు, స్మశాన వాటికలకు ప్రహరీగోడలు నిర్మిస్తాం. కొత్తపల్లి గ్రామ పొలాలకు నీరందించి, పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.

Also, read this blog: Yuvagalam Padayatra: Mobilizing Youth for Sustainable Development and Community Empowerment

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *